ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జవహర్ లాల్ నెహ్రూ తండ్రిపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, May 05, 2024, 10:29 PM

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఇప్పటికే 2 విడతల ఎన్నికలు పూర్తి కాగా మూడో దశ ఎన్నికలకు వేళయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆమెపై శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.


కంగనా రనౌత్ తాను పోటీ చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఉన్న సర్కాఘాట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన కంగనా రనౌత్.. కాంగ్రెస్ సీనియర్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూపై విమర్శలు చేశారు. ఆ కాలంలో మోతీలాల్ నెహ్రూ అత్యంత సంపన్నులు అంటూ కంగనా పేర్కొన్నారు. అప్పట్లో మోతీలాల్ నెహ్రూ ఆ కాలం నాటి అంబానీ అని తెలిపారు. నెహ్రూ కుటుంబానికి అంత సంపద ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదని కంగనా రనౌత్ అన్నారు.


నెహ్రూ కుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటీష్‌ పాలకులకు సన్నిహితంగా ఉండేదని కంగనా రనౌత్ పేర్కొన్నారు. అయితే వారికి అంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ రహస్యమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పటికీ.. జవహర్‌లాల్ నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో ఎవరికీ తెలియదని కూడా కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కుటుంబ పాలన మొదలైందని కంగనా పేర్కొన్నారు.


ఇక సంజయ్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కూడా కంగనా రనౌత్ తీవ్ర అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మండి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్‌ను కూడా ఆమె కార్టూన్ అని పేర్కొనడం సంచలనంగా మారింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమరయోధులను బిజినెస్‌మెన్‌లతో పోల్చడం సరికాదని కాంగ్రెస్ పార్టీ కంగనా రనౌత్‌పై మండిపడింది. అంతేకాకుండా సంజయ్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించి.. కంగనా హద్దులు దాటారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ కంగనాను తదుపరి ప్రచారంలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com