ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని రక్షించని వేణుస్వామి పూజలు.. కుమారుడు అరెస్ట్, మనవడు పరారీ

national |  Suryaa Desk  | Published : Sun, May 05, 2024, 10:23 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి ప్రస్తుతం నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతున్నారు. తను చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని ఆయన కుండబద్ధలు కొట్టి చెబుతూ ఉంటారు. అయితే కొన్ని విషయాలు అచ్చం అలాగే జరగడంతో సామాన్యులతో మొదలుపెట్టి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చివరికి టీవీ ఆర్టిస్ట్‌లు కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక తాను చేసిన పూజల గురించి, చెప్పే జాతకాల గురించి యూట్యూబ్ ఛానల్‌లలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే కొన్నిసార్లు ఆయన చెప్పింది జరగకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా వేణుస్వామిని.. నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు.


గతేడాది జులైలో హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం.. వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించింది. ఇందులో భాగంగానే వేణు స్వామి ఆధ్వర్యంలో రాజ్య శ్యామల, భగలాముఖి, తారా, చిన్న మస్తా వామాచార పూజలను దేవెగౌడ కుటుంబ సభ్యులు చేశారు. ఈ పూజల్లో దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే 2023 లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. అంతేకాకుండా ఈ ఏడాది జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టింది. ఎన్నికల వేళ.. హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోలు బయటికి రావడం పెను దుమారం రేపింది. దీంతో ఆయన జర్మనీకి పారిపోగా.. హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు.


ఈ క్రమంలోనే జేడీఎస్‌ పార్టీ ఎప్పుడూ చూడని పరాభవాన్ని మూటగట్టుకోవడం, పార్టీలో కీలక నేతలు.. దేవెగౌడ కుటుంబ సభ్యులైన హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్రేవణ్ణపై తీవ్ర లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఆ పార్టీ, జేడీఎస్ కుటుంబం తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే వారి కుటుంబంతో పూజలు చేయించిన వేణు స్వామిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తాను పూజలు చేస్తే ఎలాంటివారికైనా మంచి జరుగుతుందని చెప్పే వేణుస్వామి.. ఎందుకు దేవెగౌడ కుటుంబం గురించి ముందే చెప్పలేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


ఇక ఇటీవలె వేణుస్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి ఆడనీయకుండా చేశారు. ప్రభాస్ కెరీర్ పీక్ స్టేజ్ అయిపోయిందని.. ఇక ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్స్ రావని కొన్ని రోజుల క్రితం వేణుస్వామి చెప్పారు. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన సలార్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిందో అంతా చూశారు. దీంతో సలార్ రిలీజ్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు దేవెగౌడ ఫ్యామిలీ విషయంలో కూడా వేణు స్వామి టార్గెట్‌గా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com