ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజ్వల్ రేవణ్ణ బాధితులకు కర్ణాటక సర్కార్ అండ.. ఆర్థిక సాయం చేస్తామని ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sun, May 05, 2024, 10:18 PM

ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తామని ప్రకటించింది. బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు.


మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు కర్ణాటక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ.. మనవడు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. వందలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన వీడియోలు దాదాపు 3 వేలకు పైగా బయటికి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే రేవణ్ణ వేధింపులకు గురైన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రణ్‌దీప్‌ సుర్జేవాలా.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.


ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని.. వారికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించినట్లు చెప్పారు. ఇది చాలా భిన్నమైన కేసు అని.. గత 75 ఏళ్లలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. బీజేపీ-జేడీఎస్‌ కూటమిగా ఏర్పడి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున.. వారిని రక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీని ప్రశ్నించారు.


ఇక ప్రజ్వల్‌ రేవణ్ణ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేకపోయిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని.. ప్రజ్వల్ రేవణ్ణను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ప్రజ్వల్‌ రేవణ్ణను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com