హైదరాబాద్: ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో ఈ తెల్లవారు జామున 4.30 గంటలకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. 1973లో మమత చిత్రంతో నిర్మాతగా మారిన శేఖర్ బాబు... చిరంజీవితో ముఠామేస్త్రీ, బాలకృష్ణతో సాహస సామ్రాట్, కృష్ణంరాజుతో జగ్గు, సర్దార్ వంటి చిత్రాలను నిర్మించారు. జగపతిబాబు నటించిన శుభలగ్నం చిత్రాన్ని తమిళ, హిందీలో రిమేక్ చేశారు.
చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా సేవలందించిన శేఖర్ బాబు... చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సన్నిహితంగా ఉండేవారు. శేఖర్ బాబు అకాల మరణం పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, దర్శకులు రాఘవేందర్ రావు, నటుడు మురళీమోహన్, నిర్మాత సి.కల్యాణ్, అశ్వినీదత్, వ్యాపార వేత్త రఘురామరాజు ఇతర ప్రముఖులు శేఖర్ బాబు నివాసానికి తరలివచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. శేఖర్ బాబు మృతదేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీంటి పర్యంతమయ్యారు. శేఖర్ బాబుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నైలో ఉన్న కుమారుడు, అమెరికాలో ఉన్న కుమార్తె రాగానే ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు శేఖర్ బాబు కుటుంబసభ్యులు తెలిపారు.