ఇంఫాల్: పదిహేనేళ్లుగా మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. మణిపూర్ని తూర్పున ఉన్న స్విట్జర్లాండ్ అనేవారని, కానీ అందుకు తగిన అభివృద్ధి ఏమైనా మీకు కన్పిస్తోందా? యువతకు ఉద్యోగాలు ఉన్నాయా.. అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. ఇంఫాల్లో శనివారం మధ్యాహ్నం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచారానికి తాను వచ్చినపుడు ఇంఫాల్లో సభ పెడితే సగం కూడా నిండలేదని ఇప్పుడు పూర్తిగా నిండిపోయిందని పేర్కొంటూ భాజపా పట్ల ఆదరణ చూపుతున్న ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే విజయం సాధించిన వేడుకలు జరుపుకొంటామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉండి కాంగ్రెస్ ఎన్నో పాపాలు చేసిందని, ఆ పార్టీని తుడిచిపెట్టేయాల్సిన సమయం వచ్చిందని మోదీ పేర్కొన్నారు.60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి మార్చి 4, 8 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈసారి భాజపా ప్రాంతీయ పార్టీలైన నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి పార్టీలాంటి వాటి మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ పార్టీలన్నీ కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. 15 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గత ఆరునెలల్లో మంత్రులతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు భాజపాలో చేరారు. యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధం విధించిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల జీవనం స్తంభించింది.