ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ప్రజలకు ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 12:44 PM

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌లో ఉగ్ర ముప్పు పొంచి ఉందని.. ఆ దేశానికి అనవసర ప్రయాణాలు చేయవద్దని అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులను హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యమైన, అత్యవసర ప్రయాణాలు కాకపోతే వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది.


పాక్‌లో భద్రతపై ఇప్పటికే ఈ ఏడాది మే 22న అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేయగా.. తాజాగా మరోసారి ప్రయాణ హెచ్చరికలు చేసింది. ఆ దేశంలో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, గిరిజనులు, న్యాయసిబ్బంది, మానవతావాదులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేయడం అక్కడ సాధారణం అయిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. పాక్‌లో స్థానిక, విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి అమెరికా ప్రజలకు అడుగడుగునా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.


గతంలో అమెరికా దౌత్యవేత్తలు, అధికారులపై దాడులు జరిగిన సందర్భాలున్నాయని.. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు.పాక్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడులను కూడా ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని కోరింది.


పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని, ఉగ్రవాద నిర్మూలనకు ఆ దేశం చర్యలు చేపట్టాలని అమెరికా గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్‌ మాత్రం తమది ఉగ్రవాదుల దేశం కాదని చెప్పుకొస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com