వాషింగ్టన్: పాకిస్థాన్లో ఉగ్ర ముప్పు పొంచి ఉందని.. ఆ దేశానికి అనవసర ప్రయాణాలు చేయవద్దని అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులను హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యమైన, అత్యవసర ప్రయాణాలు కాకపోతే వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది.
పాక్లో భద్రతపై ఇప్పటికే ఈ ఏడాది మే 22న అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేయగా.. తాజాగా మరోసారి ప్రయాణ హెచ్చరికలు చేసింది. ఆ దేశంలో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, గిరిజనులు, న్యాయసిబ్బంది, మానవతావాదులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేయడం అక్కడ సాధారణం అయిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. పాక్లో స్థానిక, విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి అమెరికా ప్రజలకు అడుగడుగునా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
గతంలో అమెరికా దౌత్యవేత్తలు, అధికారులపై దాడులు జరిగిన సందర్భాలున్నాయని.. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు.పాక్లో ఇటీవల చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడులను కూడా ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని కోరింది.
పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని, ఉగ్రవాద నిర్మూలనకు ఆ దేశం చర్యలు చేపట్టాలని అమెరికా గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్ మాత్రం తమది ఉగ్రవాదుల దేశం కాదని చెప్పుకొస్తోంది.