హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. బుధవారం విశాఖ పర్యటనలో భాగంగా డీసీఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపి అనంతరం పార్టీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో పలు విషయాలుపై ఆయన ప్రసంగించారు.
కాగా నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పవన్ పర్యటిస్తున్నారు. రాత్రి కూడా ఆయన రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లో బస చేశారు. దీంతో హోటల్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో పవన్ హోటల్ నుంచి బయటికి వచ్చి అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. పవన్ అభివాదం చేస్తుండగా ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఓ యువకుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. యువకుడి తలకు గాయమైంది. అప్రమత్తమైన అభిమానులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. మరోవైపు పవన్ కాన్వాయ్లోని వాహనం తగిలి కానిస్టేబుల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.