తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలకు అధికార అన్నాడీఎంకే అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నమ్మకస్తుడు ఈ. మధుసూదన్ను ఉపఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది.
అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని అన్నాడీఎంకే అధిష్ఠానం కోరింది. దీంతో మధుసూదన్ సహా మరో 19 మంది మంగళవారం తమ దరఖాస్తులను సమర్పించారు. వీరిలో మధుసూదన్ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మధుసూదన్ పోటీ చేశారు. అప్పుడు పన్నీర్ సెల్వం వర్గం తరఫున అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ నుంచి ఆయన పోటీచేశారు. అయితే కొన్ని పార్టీలు డబ్బులిచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయన్న ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను రద్దు చేశారు.
దీంతో మరోసారి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 24న ఫలితాలు వెల్లడించనున్నారు.