పాడేరు: విశాఖ మన్యంలో ఈరోజు వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా.. 10 మంది గాయపడ్డారు. పాడేరు మండలం చెక్గేట్ వద్ద ద్విచక్రవాహనాన్ని జీపు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ముంచంగిపుట్టు మండలం బొండ్రుగుడలో రహదారి పక్కన తవ్విన గోతిలో బైక్ పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ప్రమాదంలో పాడేరు మండలం కరకపుట్టు వద్ద ఆటో బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దబయలు మండలం అడుగులపుట్టు వద్ద జీపు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఏజెన్సీలో వరుసగా జరిగిన ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.