పంజాబ్ రాజకీయాలలో శాశ్వతముద్రవేసే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులేస్తోంది. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్- పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. పరిపాలనను పరుగులెత్తిస్తోన్నారు. 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన రోజే వారిని సమావేశపరిచారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏకంగా 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను ఆమోదించారు. ఎన్నికల హామీలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి అనుగుణంగా- పంజాబ్లో అటు పార్టీని కూడా బలోపేతం చేయడంపై అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబీయులకు ఆరాధ్యుడైన మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఆయనను పెద్దల సభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. డాక్టర్ సందీప్ పాఠక్- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. మరో స్థానాన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్కు కేటాయించింది. మిగిలివున్న అయిదో స్థానం కోసం అభ్యర్థి పేరును ఖరారు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై కసరత్తు చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. రాజ్యసభకు నామినేట్ చేయదలిచిన అయిదో అభ్యర్థి పేరును ఈ మధ్యాహ్నానికి ఖరారు చేస్తుందని తెలుస్తోంది.