క్రమంగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెరుగుతోంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో- ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ పార్టీకి దక్కిన సీట్లు 18 మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీ తాను పోటీ చేసిన రెండో చోట్లా ఓడిపోయారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పరాజయం పాలయ్యారు. వారిపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. దీనితో పంజాబ్ నుంచి మొత్తంగా అయిదుమందిని రాజ్యసభకు పంపించడానికి అవసరమైన బలం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది. ఇందులో భాగంగా ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిందా పార్టీ. మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. హర్భజన్ సింగ్తో పాటు ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ రాఘవ్ ఛద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ను నామినేట్ చేసింది. కాగా- పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినవారి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. కాంగ్రెస్ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, ఎస్ఎస్ డుల్లో, బీజేపీకి చెందిన ష్వైత్ మలిక్, శిరోమణి అకాలీదళ్ సభ్యుడు నరేష్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్-సంయుక్త్కు చెందిన ఎస్ఎస్ ధిండ్సా సభ్యత్వం ముగుస్తుంది. దీనితో ఆయా స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగునున్నాయి. పంజాబ్ నుంచే రాజ్యసభకు నామినేట్ అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోని, శిరోమణి అకాలీదళ్కు చెందిన బల్వీందర్ సింగ్ భుందేర్ సభత్యవం జులై 4న ముగుస్తుంది. ఈ స్థానాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి.