అండ్రాయిడ్ ఫోన్ అంటేనే మన డాటాకు భద్రత కరువు అన్నది వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ కొత్తగా ఒక గోప్యత ఫీచర్ ను చేర్చింది. యూజర్లు గూగుల్ యాప్ పై చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సాఫ్ట్ వేర్ అప్ డేట్ ద్వారా అమలు చేయడం ప్రారంభించినట్టు.. వచ్చే కొన్ని వారాల్లో యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం యూజర్లు ఫోన్లో గూగుల్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది మే నెలలో తొలిసారి ఈ ఫీచర్ గురించి గూగుల్ ప్రకటన చేసింది. ముందుగా యాపిల్ ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం దీన్ని అందింనుంది. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించే వారు.. ఫోన్ లోని గూగుల్ యాప్ తెరిచి ప్రొఫైల్ పిక్చర్ పై ట్యాప్ చేయాలి. అక్కడే ‘డిలీట్ లాస్ట్ 15 మినిట్స్’ను ట్యాప్ చేస్తే సరిపోతుంది. గూగుల్ యాప్ పై కొందరు యూజర్లు అసభ్యకరమైన అంశాల గురించి కూడా శోధిస్తూ ఉంటారు. దీని గురించి ఇతరులు తెలుసుకోవడం తమకు గౌరవంగా అనిపించుకోదని భావించే వారికి కొత్త సదుపాయం అనుకూలంగా ఉంటుంది.