లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాత కావడంతో వ్యవహారం మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. టీడీపీ నేతలు వర్మపై రోజుకో కామెంట్ చేయడం ఆ విమర్శలకు సోషల్ మీడియా ద్వారా వర్మ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న స్పందించారు. ఈ సినిమాకు అనవసర ప్రధాన్యతను ఇచ్చి, లేనిపోని ప్రచారం కల్పించవద్దంటూ తన పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, వర్మ నేరుగా చంద్రబాబుకే రిప్లై ఇచ్చారు.
ఈ సినిమాలో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం. అందుకే జరిగిన నిజాలను ఏమాత్రం వక్రీకరించకుండా, సినిమా తీయబోతున్నాను. చంద్రబాబు గారు అన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను ఈ సినిమా ద్వారా తిరిగి అతికించబోతున్నాను.