ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంట నూనెల ధరలకు సర్కార్‌ బ్రేక్‌..!

national |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 01:59 PM

ఎక్కడ ఏది జరిగినా.. దాని ప్రభావం మనపై పడే అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు.. వెంటనే బ్లాక్‌మార్కెట్‌ దారులు మేల్కొంటున్నారు.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలకు షాక్‌ ఇస్తున్నారు.. అయితే, సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ ధరల నియంత్రణకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్ విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధికధరల విక్రయానికి చెక్‌ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు కూడా చౌకధరల దుకాణాల్లో కొనాలని సూచించింది. ఇకపై నూనె వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న స్టాకును స్వాధీనం చేసుకుని తక్కువ ధరకు విక్రయించనున్నారు. అంతేకాదు హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు కేంద్రప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయనున్నారు అధికారులు.


 


రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంట నూనె ధరలకు బ్రేక్ వేసేందుకు వంట నూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అయినప్పటికీ కొంత మంది కావాలనే ధరలు పెంచి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించి, ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంటే దాన్ని పాత ధరలకే అమ్మాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ…అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com