తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి బాలికల గిరి జన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చావడికోట పంచాయతీ చెక్కవాడ గ్రామానికి చెందిన అందాల సుమిత్ర (15) పదో తరగతి చదువుతోంది. ఈనెల ఒకటో తేదీన తమ కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ఆమె జ్వరంతో బాధపడుతుండడం గమనించారు. దీంతో తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళతామని అడగగా, పాఠశాల సిబ్బంది అనుమతించి విద్యార్థినిని తల్లిదండ్రులతో పంపేశారు.
గ్రామానికి చేరుకున్న తర్వాత నాలుగు రోజులకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థినిని తల్లిదండ్రులు బొద్దులూరి పీహెచ్సీకి తీసుకురాగా, జ్వరతీవ్రత ఎక్కువగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి వైద్య సిబ్బంది రిఫర్ చేశారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిలో మార్పులేకపోవడంతో మంగళవారం స్వగ్రామమైన చక్కవాడకు తిరిగి వెళుతున్న క్రమంలో మారేడుమిల్లి సెంటర్లో రోడ్డుపై ఆ బాలిక సొమ్మసిల్లిపడింది. వెంటనే తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకోగా బాలిక మృతి చెందింది. సుమిత్రను ఇంటికి పంపించిన పాఠశాల సిబ్బంది పట్టించుకున్న పాపానపోలేదు. సుమిత్ర అనారోగ్యంతో ఉండగా ఆసుపత్రికి తీసుకువెళ్లిన దాఖలే లేకపోవడం గమనార్హం.