తాననుకున్న పనులను చేసుకునే ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన వ్యూహాలకు పదును పెడతారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ పోస్టును పెట్టారు. కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీని ప్రస్తావించిన ఆయన, ఓ అధికారిని బదిలీ చేయడం అన్నది చాలా సర్వ సాధారణమేనని అన్నారు. ఇదే సమయంలో బదిలీని సమర్థించుకునేందుకు ఆయనపై ఆరోపణలను మీడియాకు లీక్ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బదిలీల ప్రక్రియ సాగుతోందని కృష్ణారావు ఆరోపించిన సంగతి తెలిసిందే. మీడియాకు ముందుగానే లీకులిచ్చి తమకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయడమే చంద్రబాబు వ్యూహ చతురతని అన్నారు. రొటీన్ గా బదిలీ చేస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని, ఈ రకంగా వ్యవహరించడం తప్పుడు సంకేతాలను పంపుతోందని అన్నారు.