వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. అగ్రరాజ్యానికి ఆయన ప్రథమ పౌరుడు కావడంతో ప్రథమ మహిళ హోదాపై ట్రంప్ భార్యల మధ్య చిచ్చు రేగింది. ఇది కాస్తా ముదిరి ట్రంప్ మాజీ భార్య, ప్రస్తుత భార్య బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే..
ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ రైజింగ్ ట్రంప్ పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ట్రంప్తో తన వైవాహిక జీవితం, విడాకులు, పిల్లల్ని పెంచడం లాంటి వివరాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే ట్రంప్ నుంచి తాను విడిపోయినట్లు ఇవానా చెప్పుకొచ్చారు. త్వరలో ఈ పుస్తకం విడుదల కానుంది. అయితే తాజాగా ఈ పుస్తకం ప్రమోషన్లో భాగంగా ఇవానా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తానే ప్రథమ మహిళకు అర్హురాలిని అని చెప్పారు. నేను ట్రంప్కు మొదటి భార్యను ఒకే.. అంటే నేను దేశానికి మొదటి మహిళను. నేను శ్వేతసౌధానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు. కానీ నేను వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ మెలానియా ఉంది. నేనెవరికీ అసూయ కలిగించాలని అనుకోవడం లేదు అని ఇవానా అన్నారు. అంతేగాక మెలానియా శ్వేతసౌధంలో ఉండేందుకు చాలా కష్టపడుతున్నట్లు ఉంది అని విమర్శించారు.
దీంతో ఇవానా వ్యాఖ్యలపై ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా అధికారిక ప్రతినిధి స్టీఫానీ గ్రిషామ్ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్, ఆయన కుమారుడు బారెన్కు శ్వేతసౌధాన్ని ఓ సొంతింటిగా తీర్చిదిద్దారు మెలానియా. వైట్హౌస్లో నివసించడాన్ని ఆమె ఎంతో ఇష్టపడుతున్నారు. అంతేగాక ప్రథమ మహిళగా తన బాధ్యతలను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ హోదాతో చిన్నారుల సంరక్షణకు ఆమె కృషిచేస్తున్నారు. అంతేగానీ.. పుస్తకాలు అమ్ముకోడానికి కాదు(ఇవానా పుస్తకాన్ని ఉద్దేశించి) అని ప్రకటనలో పేర్కొన్నారు. ఏదేమైనా అధ్యక్షుడికి సైతం ఇంటి తిప్పలు తప్పట్లేదు.