చెన్నై: దీపావళిని పురస్కరించుకొని తపాలా కేంద్రాలలో బాణాసంచా విక్రయానికి బదులుగా స్వీట్ కూపన్లు విక్రయించేందుకు తపాలాశాఖ నిర్ణయించింది. ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ బాణాసంచా సంస్థల బాణాసంచాను తపాలాశాఖ విక్రయిస్తుంది. దీనికిగాను కూపన్లను తపాలా కార్యాలయాల్లో పొంది ఆయా సంస్థల బాణాసంచాలను దుకాణాలలో తీసుకోవచ్చు. నేరుగా దుకాణాలలో కొనుగోలు చేయడం కన్నా, ధర చౌకగా ఉంటుంది. కూపన్లు రూ.500, రూ.1000, రూ.2 వేలల్లో లభ్యమయ్యేవి. వీటికి 10 శాతం రాయితీ కూడా ఉండేది.
సాధారణంగా ఈ విక్రయాలు తపాలా కార్యాలయాలలో దీపావళికి 10 రోజుల ముందే ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం దీపావళి 12 రోజులు ఉన్న నేపథ్యంలో తపాలా శాఖ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ విషయమై తపాలా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో మాత్రమే బాణాసంచా కూపన్ల విక్రయాలు జరుగుతాయన్నారు. గత ఏడాది బాణాసంచా విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది కూపన్ల పంపిణీ ప్రశ్నార్థకమైందన్నారు. వాటికి బదులుగా స్వీట్ కూపన్లను విక్రయించేందుకు నిర్ణయించామని తెలిపారు.