విజయవాడ : కనకదుర్గ గుడి టోల్ గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు గల జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా ఈ మార్గంలో పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. గురువారం అర్ధరాత్రి నుంచి నెల రోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ ప్రకటించింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. విద్యాధరపురం, ఇబ్రహింపట్నం వైపు వెళ్లే వాహనాలు బీఆర్పీ రోడ్డు, వీజీ చౌక్, చిట్టినగర్ నుంచి సొరంగం మార్గం ద్వారా వెళ్లాలి. వయా ఎర్రకట్ట, సొరంగ మార్గంలోనూ ప్రయాణించవచ్చు వైవీరావు ఎస్టేట్, సీవీఆర్ ఫ్లైఓవర్, సితారా జంక్షన నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలు గొల్లపూడి సెంటర్, సితారా జంక్షన, సీవీఆర్ ఫ్లైఓవర్, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, వీజీ చౌక్, పంజా సెంటర్, రైల్వే దక్షిణ బుకింగ్ రోడ్డు, లోబ్రిడ్జి మార్గంలో రావాలి. గొల్లపూడి సెంటర్, సితార జంక్షన, సీవీఆర్ ఫ్లైఓవర్, వైవీరావు ఎస్టేట్, పైపుల రోడ్డు, సింగ్నగర్ ఫ్లైఓవర్, బీఆర్టీఎస్ రోడ్డులో రాకపోకలు సాగించవచ్చు.