అమరావతి: చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నాలుగో జాతీయ జలరవాణా మార్గానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రూ. 96 కోట్లతో తొలిదశ జల రవాణా పనులు నిర్వహిస్తున్నామని, కొత్తగా 1890 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరగనుందన్నారు. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలను కలపాలంటే ఏపీ కీలకమని, విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి వెంకయ్యనాయుడు అండగా నిలిచారని చంద్రబాబు అన్నారు. అలాగే మూడు దశల్లో జాతీయ జలరవాణా మార్గం పనులు జరుగుతాయని, ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ, రెండో దశలో కాకినాడ-విజయవాడ మధ్య పనులు జరుగుతాయన్నారు. అలాగే మూడో దశలో విజయవాడ-పుదుచ్చేరి మధ్య పనులు జరుగతాయని, అలాగే సరుకు రవాణా, ప్రయాణికుల టెర్మినల్స్ నిర్మాణం జరగనుందన్నారు. నితన్ గడ్కరీ ఏపని మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరని, ఈ ప్రాజెక్ట్లు పూర్తయితే వాణిజ్యపరంగా ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు.