విజయవాడ: పౌర సరఫరాల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించడం లేదంటూ ప్రజల నుంచి అసంఖ్యాక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇకపై డీలర్లు సమయానికి సరకులు ఇవ్వాల్సిదేనంటూ స్పష్టంచేశారు. డీలర్ల న్యాయపరమైన కోర్కెలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చేలా వ్యవహరించవద్దని హితవు పలికారు.త్వరలో కందిపప్పు, పంచదార, కిరోసిన్ మళ్లీ అందించనున్నామని చెప్పారు. విలేజ్మాల్స్ ప్రయోగాత్మకంగా పట్టణాలకే పరిమితం చేస్తున్నామని, 20 శాతం తక్కువ ధరకే సరకులు అమ్మకాలు జరగనున్నాయని మంత్రి తెలిపారు. సాగునీటి అంశంపై సాక్షి పత్రిక విషపూరిత రాతలు రాస్తోందని మంత్రి మండిపడ్డారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆ పత్రిక రాతలున్నాయని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తే జగన్ ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ తెలుగు దేశం వినతులకు మూడు నెలల్లో పరిష్కారం లభించనుందని మంత్రి పుల్లారావు వెల్లడించారు.