18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వారం శుభవార్త వస్తుందని అధికారవర్గాల సమాచారం. బకాయిలపై కేంద్ర మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ అక్టోబర్ 2021 కి సంబంధించి 17 శాతాన్ని 31% గా పునరుద్ధరించారు. అయినప్పటికీ దానికి సంబంధించిన బకాయిలు ఉద్యోగులకు ఇవ్వలేదు. తాజాగా కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఒక్కసారిగా మొత్తం డీఏ, డీఆర్ అలవెన్స్ సొమ్ము పడుతుందని అంటున్నారు. అంటే కొంతమంది ఉద్యోగులకు ఈ బకాయిల మొత్తం రూ. 2 లక్షలకు చేరుకుంటుంది. కేంద్రం నిర్ణయం అమలైతే ఈ మొత్తం సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని అధికార వర్గాల సమాచారం.
కాగా, ఈ అంశంపై వచ్చే వారంలో కేంద్ర మంత్రి వర్గం ఒక నిర్ణయం తీసుకుంటుందని, డీఏ ఎంత అనేది నిర్ణయిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జేసీఎం నేషనల్ కౌన్సిల్ మెంబర్ శివ గోపాల్ మిశ్రా గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. లెవెల్ 1 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి 27,554 వరకు ఉన్నాయి. అయితే, లెవెల్-13 (7th CPC బేసిక్ పే స్కేల్ రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900), లెవెల్-14 పే స్కేల్ ప్రకారం ఒక ఉద్యోగికి డీఏ బకాయిలు రూ. 1,44,200 – 2,18,200. చెల్లించాల్సి ఉంటుంది.