-అక్రమాస్తుల కేసులో శశికళకు మరోషాక్
-కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే శిక్షాకాలం పొడిగింపు
-సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలి
-బెంగళూరు జైలు నుండి చెనై్న జైలుకు తరలించాలని చిన్నమ్మ అభ్యర్థన
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలు శిక్షను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న శిక్షాకాలం కంటే మరో 13 నెలలు అదనంగా అనుభవించాల్సి వస్తుంది. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు శశికళ మరికొందరికి జైలు శిక్షను ప్రకటించింది. దీని ప్రకారం శశికళ మూడు సంవత్సరాల 11నెలలపాటు జైలు కాలాన్ని పూర్తి చేయాలి. అదే సమయంలో రూ.10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు విధించింది. ఈ జరిమానాను శశికళ చెల్లించకుంటే మాత్రం మరో 13 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ రూ.10 కోట్ల జరిమానా కట్టాలి. అలా చేయలేకపోతే మరో 13 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బెంగళూరు నుంచి చెనై్న జైలుకు మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమెను చెనై్న పజల్ సెంట్రల్ జైలుకు మార్చాలని ఆమె న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ దాఖలుచేశారు.