ఎవరూ ఊహించని రీతిలో ఓ మహిళా కానిస్టేబుల్ డ్యూటీలో తనువు చాలించింది. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిన ఆ మహిళ విగత జీవిగా ఇంటికి చేరడం తీవ్ర విషాదం నింపింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తాళ్పేట్ ట్రాఫిక్ డివిజన్లో కవిత(40) కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కుమారుడు అరుణ్ కుమార్ సాలెం మహీంద్రా కాలేజ్లో చదువుతుండగా 18 ఏళ్ల కూతురు స్నేహ ప్రియ బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కొడుకు విశాల్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే చెన్నై జనరల్ సెక్రటేరియట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఇంతలో అక్కడ ఉన్న 75 ఏళ్ల నాటి చెట్టు ఆమెపై విరిగి పడింది. ఈ ఘటనలో కవిత స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కవిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఊహించని రీతిలో కవితను మృత్యువు కబలించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.