ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుంచి బయట పడలేదు. ఇప్పుడు మరో డేంజర్ బెల్ మోగింది. ఇది మరింత ప్రమాదం కరం అంటున్నారు వాతావరణ నిపుణులు. తాజాగా జవాద్ తుఫాన్ ముప్పు వణికిస్తోంది. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరి కొన్ని గంటల్లో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిషా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇక ఈ అల్పపీడనం రేపటికి తుఫానుగా బలపడి ఆతర్వాత వాయువ్యదిశగా కదిలి డిసెంబరు 4న ఉదయం ఉత్తరాంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3, 4 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇక రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.