న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అర్థగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగాయి. ఏఐఏడీఎంకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాలన్నీ ఏకమవుతున్నట్టు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ పళనిస్వామి ప్రధానితో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వారాంతానికల్లా పార్టీలోని ఇరువర్గాలూ విలీనం కానున్నట్టు సీఎం పళని ప్రధానికి వివరించినట్టు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు మాజీ సీఎం, జయలలిత విధేయుడు పన్నీర్సెల్వం కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ... ఈ ఇద్దరు నేతలూ పార్టీ సమన్వయం కోసం చర్యలు చేపట్టనున్నట్టు కనిపిస్తోంది. విలీనానికి మార్గం సుగమం చేసేలా ఇప్పటికే ఏఐఏడీఎంకే నేతలు ఆ పార్టీ డిప్యూటీ చీఫ్, శశికళ మేనల్లుడు దినకరన్ను పదవినుంచి గెంటేసిన సంగతి తెలిసిందే. దినకరన్ నియామకం అక్రమంగా జరిగిందనీ ఆయనకు కట్టబెట్టిన పదవి చెల్లదనీ, ఆమోదయోగ్యం కాదని ఏఐఏడీఎంకే ఓ తీర్మానం కూడా ఆమోదించింది. ఆఫీస్ బేరర్ల నియామకం సహా పార్టీ విషయంలో దినకరన్ తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేసింది.