ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చెన్నై తో బెంగళూరు ఢీ.. గెలిచేదెవరో?

national |  Suryaa Desk  | Published : Fri, Sep 24, 2021, 05:00 PM

ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా సూపర్ మ్యాచ్ జరుగబోతున్నది. ఈ సీజన్‌లో వరుస విజయాలు సాధిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, తొలి దశలో దూకుడు ప్రదర్శించి రెండో దశను ఘోర ఓటమితో ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఎంతో అనుభవం కలిగిన ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా.. కోహ్లీ సేన కేకేఆర్‌పై ఓటమితో డీలా పడింది. అయితే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తున్నది. మరోవైపు ఆర్సీబీపై గెలవడం ద్వారా మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చెన్నై అనుకుంటున్నది. ఈ రోజు మ్యాచ్ సందర్భంగా అందరి దృష్టి కొంత మంది ఆటగాళ్లపై ఉన్నది. వీరి మధ్య జరిగే పోరాటంలో ఎవరు ఆధిపత్యం సాగిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.


ఈ మ్యాచ్‌లో మొదట అందరి చూపి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంటుంది. గత కొంత కాలంగా ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో మొత్తం 203 పరుగులు చేశాడు. అతడి సగటు కేవలం 29 ఉండగా స్ట్రైక్ రేట్ 121.55గా ఉన్నది. ఇక అతడిని నిలువరించేందుకు ఎంఎస్ ధోనీ తమ అమ్ముల పొదిలోని దీపక్ చాహర్‌ను బరిలోకి దింపే అవకాశం ఉన్నది. చెన్నై తరపున విజయవంతమైన బౌలర్లలో దీపక్ చాహర్ ఒకడు. ఇప్పటి వరకు రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 వికెట్లు తీశాడు. కోహ్లీ - చాహర్ మధ్య పోటీ ఎలా ఉండబతోతుందనేది ఆసక్తికరంగా మారింది.


ఐపీఎల్ 2020లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఫాఫ్ డు ప్లెసిస్, ఆర్సీబీ పేసర్ కేల్ జేమిసన్ మధ్య పోరాటం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేల్ జేమిసన్ కాస్త భారీగానే పరుగులు ఇచ్చాడు. తన యార్కర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే జేమిసన్ ఈ మ్యాచ్‌లో ఏం చేయబోతున్నాడో చూడాలి. అదే విధంగా డు ప్లెసిస్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 320 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు జరుగనున్నది.


ఇక చివరిగా ఎంఎస్ ధోనీ - స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మధ్య పోరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో చాహల్ పెద్దగా రాణించలేదు. ఏనిమిది మ్యాచ్‌లలో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకే వికెట్ తీయగలిగాడు. మరోవైపు ధోనీ ఫామ్‌లోనే కనపడుతున్నాడు. గతంలో ఎన్నో సార్లు చాహల్‌ను నెట్‌లో ఎదుర్కొని ఉంటాడు. కానీ మైదానంలో వీరిద్దరి మధ్య పోరు చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com