ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను పిటిషనర్ ధర్మాసనం ముందు ఉంచారు. విచారణలో భాగంగా పిటిషనర్ ప్రొసీడింగ్స్ ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు.
ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ లాయర్ ను ఆదేశించింది. ఈనెల 29న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైకోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.