ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆ భయం..

national |  Suryaa Desk  | Published : Tue, Sep 07, 2021, 04:48 PM

ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్‌ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌, బ్రౌన్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్‌ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు. వాటిలో కరోనా యాంటీబాడీల స్థాయిల్ని లెక్కించారు. వాలంటీర్లంతా ఫైజర్‌ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారే. ‘‘టీకా తీసుకున్న 6 నెలల తర్వాత సార్స్‌-కొవ్‌-2 ప్రతినిరోధకాలు 80% మేర తగ్గిపోతున్నాయి. ఈ తగ్గుదల అందరిలోనూ ఒకేలా ఉంటోంది. నర్సింగ్‌ హోమ్స్‌ నివాసుల్లో 70% మందికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేంత స్థాయిలో యాంటీబాడీలు ఉండటం లేదు’’ అని పరిశోధనకర్త డేవిడ్‌ కెనడే చెప్పారు. డెల్టా రకం వైరస్‌ విజృంభిస్తున్నందున బూస్టర్‌ డోసు ఆవశ్యకతను తమ అధ్యయనం వెల్లడిస్తోందన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధుల సగటు వయసు 76 ఏళ్లు, ఆరోగ్య కార్యకర్తల సగటు వయసు 48 సంవత్సరాలు. అయితే ఈ రెండు వయో వర్గాల వలంటీర్లలోనూ యాంటీబాడీల తగ్గుదల దాదాపు ఒకే రీతిలో జరిగిందని తేలడం గమనార్హం. ఇటువంటి వారికి మూడో (బూస్టర్‌) టీకా డోసు అవసరమని వైద్యనిపుణులు అంటున్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘మెడ్‌ ఆర్కైవ్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com