గాయం కారణంగా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కియా సూపర్ లీగ్ టీ20కి దూరమైంది. ఇంగ్లాండ్లో ఆగస్టు 10న ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో హర్మన్ తన ఆటతీరుతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. టోర్నీలో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్పై 171 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే హర్మన్ భుజం నొప్పితో బాధపడింది. దీంతో ఒకానొక సమయంలో ఆతిథ్య ఇంగ్లాండ్తో ఫైనల్ ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలు వచ్చాయి. కానీ, కీలక మ్యాచ్లో తప్పనిసరిగా ఆడాలని భావించిన హర్మన్ నొప్పిని భరిస్తూ బరిలోకి దిగి.. 51 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని మిథాలీ సేన భారత్ చేరుకుంది. గత వారం బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం అనంతరం హర్మన్ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ తీయించుకోగా వైద్యులు ఆమెకు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆమె ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యే కియో సూపర్ లీగ్ టీ20కి దూరమవ్వాల్సి వచ్చింది. సర్రె స్టార్స్ జట్టుకి హర్మన్ ప్రాతినిథ్యం వహిస్తోంది.