ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫోన్‌తోపాటు మొబైల్‌ టు టీవీ కేబుల్‌ను అందిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 06:51 PM

ముంబయి: రిలయన్స్‌ జియో సంచలనాలకు మారుపేరు. ఈరోజు ఆవిష్కరించిన జియో ఫోన్‌ కూడా మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిజిటల్‌ మార్కెట్‌లో ప్రధానంగా మూడు రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు.. కేబుల్‌-డీటీహెచ్‌ సర్వీసులు.. ప్రవేశ స్థాయి స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు.. ఈ మూడు రంగాలపై జియోఫోన్‌ ప్రభావం భారీగానే ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ జియోఫోన్‌ను ఆవిష్కరించగానే ఈ మూడు విభాగాల్లోని ప్రత్యర్థి కంపెనీల షేర్లు నష్టాలబాట పట్టాయి. భారత్‌లో తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ వెచ్చించాల్సిందే. అయితే ఈ నేపథ్యంలో జియోఫోన్‌ను ఉచితంగా అందించడం ద్వారా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వాడని దాదాపు 50 కోట్ల మందిని ఆ కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఫోన్‌ రాకతో మైక్రోమాక్స్‌, లావా, కార్బన్‌, ఒప్పోలాంటి మొబైల్‌ ఫోన్ల అమ్మకాలపై తప్పకుండా ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు.


కేబుల్‌ డిస్ట్రిబ్యూటర్లు, డీటీహెచ్‌ కంపెనీలపై కూడా ఈ చిన్న ఫోన్‌ పెద్దప్రభావమే చూపనుంది. ఎందుకంటే ఈ ఫోన్‌తోపాటు మొబైల్‌ టు టీవీ కేబుల్‌ను అందిస్తున్నారు. దీన్ని టీవీకి కనెక్ట్‌ చేసి ఫోన్‌ ద్వారా ఏ ఛానల్‌నైనా టీవీలో వీక్షించవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఈ జియోఫోన్‌ ఆ సమయంలో సెట్‌టాప్‌ బాక్స్‌గా మారిపోనుంది. ఎందుకంటే జియో యాప్‌ ద్వారా ప్రముఖ ఛానెళ్లన్ని అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.


రిలయన్స్‌ జియో తమ కస్టమర్లను ఎక్కడికిపోకుండా కాపాడుకోవడానికి రకరకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఇప్పటికే జియో దెబ్బకి కుదేలైన ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌లాంటి సంస్థలను తాజాగా తక్కువ ధరలకు అపరిమిత డేటా లాంటి ఆఫర్లు మరింత నష్టపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com