ప్రభుత్వం ఈ నెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది.. ఈ పథకం కింద ప్రైవేట్ సంప్రతింపుల ద్వారా చేస్తున్న భూ సేకరణను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీ నిలుపుదల, భూ సేకరణ విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. అయితే భూ సేకరణ ప్రక్రియ మాత్రం తీర్పునకు లోబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రైవేట్ వ్యక్తుల నుంచి సంప్రతింపులతో భూ సేకరణ జరపటం చట్ట విరుద్ధమంటూ బీజేపీ నేత సాగి విశ్వనాధం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది సీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ ఈనెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ చేయ కుండా నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనిపై జస్టిస్ రాకేశ్కుమార్ స్పందిస్తూ ప్రభుత్వం వల్ల భూ యజమాని ప్రభావితమై, కోర్టును ఆశ్రయిస్తే తప్ప ఇతర సమయాల్లో స్పందించేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన భూ సేకరణ ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఇళ్లపట్టాలకు భూ సేకరణ ప్రక్రియ తాము వెలువరించే తీర్పునకు లోబడి ఉంటుందని తీర్పునిస్తూ కేసు విచార ణను వచ్చేనెల 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.