హిందు - ముస్లింల పెళ్లిళ్లకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 18 సంవత్సరాలు దాటిన వారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని, కోర్టు దృష్టిలో వారు హిందు - ముస్లిం కాదని స్పష్టం చేసింది. ఇద్దరు పెద్దలు కలసి సహజీవనం చేయడానికి కోర్టు అంగీకరిస్తుంది. వారు ఆడ - ఆడ, మగ - మగ కావొచ్చు. లేకపోతే ఆడ - మగ అయినా కావొచ్చు. అలాంటి వారి జీవితంలోకి వ్యక్తులు కానీ, కుటుంబం కానీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ రకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం కూడా మతాంతర వివాహాల విషయంలో జోక్యం చేసుకోలేదని కోర్టు కుండబద్దలు కొట్టింది. సలామత్ అన్సారీ అనే యువకుడు, ప్రియాంకా ఖర్వర్ అనే యువతి తమ కుటుంబాల అభీష్టానికి వ్యతిరేకంగా 2019 లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ప్రియాంకా తండ్రి.. తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ఈ క్రమంలో సలామత్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని, భద్రత కల్పించాలని కోరారు. పిటిషన్లను విచారించిన కోర్టు.. ప్రియాంక వయసు విషయంలో ఎలాంటి వివాదం లేదని, ఆమెకు 21 సంవత్సరాలు కాబట్టి తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని, ఆమె భర్తతో కలసి ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పోక్సో చట్టం వర్తించదని తేల్చి చెప్పింది. సలామత్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది. అదే సమయంలో యువతి తండ్రి తన కుమార్తెను కలిసే హక్కు కూడా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవడానికి మతం మారడాన్ని ప్రియాంకా తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ఇది చెల్లదని వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అది వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకమని అభిప్రాయపడింది.
కోర్టు దృష్టిలో ప్రియాంకా ఖర్వార్, సలామత్ అన్సారీ అనే వారు హిందు- ముస్లింలు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి తమకు నచ్చిన వ్యక్తితో స్వేచ్ఛగా నివసించే హక్కును కలిగి ఉంటారని తీర్పు వెలువరించిన జస్టిస్ పంకజ్ నఖ్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. లవ్ జిహాద్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.