శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంలో దర్శనమిచ్చారు. స్వర్ణరథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవ జరిగింది.సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. కాగా, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగనుంది. ఈ కార్యక్రమంలో పెదజీయర్స్వామి, చినజీయర్స్వామి, ఈఓ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి, డాక్టర్ నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవింద హరి, డీపీ అనంత, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.