ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగి ఆదిత్యనాథ్‌కు సొంత పార్టీ నుంచి కూడా తప్పని విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 12:53 PM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు తప్పట్లేవు. లైంగిక వేధింపుల కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై కూడా పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తాను యూపీ సీఎం యోగి కంటే సీనియర్‌నని, ఆయనకు అక్కలాంటి దాన్నని ఆమె అన్నారు. తన అభ్యర్థలను, సూచనలను కొట్టిపారేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పలు సూచనలు చేశారు.


పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తమ పార్టీకీ మచ్చ తెచ్చిందని వ్యాఖ్యానించారు.  బాధిత అమ్మాయి కుటుంబాన్ని కలిసేందుకు వస్తోన్ రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలని యోగికి సూచించారు. దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో మృతి చెందిందంటూ ఆమె ట్వీట్ చేశారు.


ఆమె అంతిమ సంస్కారాలను పోలీసులు హడావుడిగా జరిపారని చెప్పారు. అనంతరం కూడా ఆమె కుటుంబాన్ని, గ్రామ ప్రజలను ఎవరూ కలవకుండా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించే తాను ఇప్పటివరకు ఈ విషయాల గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు.


అయితే, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు విచారకరమని ఆమె చెప్పారు. కేసుల్లో  సిట్‌ దర్యాప్తు జరుపుతోన్న సమయంలో బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? అని ఆమె నిలదీశారు. వారిని కలవనీయకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సిట్‌ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయని ఆమె చెప్పారు.


తమ పార్టీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని, దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అయితే, హత్రాస్‌లో పోలీసుల తీరు యోగి సర్కారుతో పాటు తమ పార్టీకి   మచ్చ తెస్తోందని చెప్పారు.  తాను ప్రస్తుతం కొవిడ్‌-19కి చికిత్స తీసుకుంటున్నానని ఆమె వివరించారు.


కరోనా సోకకపోతే తాను ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్నని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు.  బాధిత కుటుంబాన్ని కలిసేందుకు నాయకులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆమె చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com