మన కోర్టుల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని కోర్టుల్లోనూ ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ వివరాలను రాజ్యసభ్యుడు పరిమల్ నత్వానీ పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని అడిగి తెలుసుకున్నారు. 17 సెప్టెంబర్, 2020 నాటికి.. ఏపీ హైకోర్టులో 2,03,024 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక దిగువ కోర్టులలో 5,82,069 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవలే రాజ్యసభలో కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులు పరిమల్ నత్వానీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత, స్థానిక పరిస్థితులను బట్టి వర్చువల్ లేదా భౌతిక విధానాలలో అత్యవసర సివిల్ మరియు క్రిమినల్ కేసులలో వాదనలను వినేందుకు సంబంధిత హైకోర్టులు తమ పరిపాలనా పరిధిలోని దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు.కోవిడ్ 19 నిర్వహణ కోసం నూతన సాఫ్ట్వేర్ ప్యాచ్ మరియు కోర్ట్ యూజర్ మాన్యువల్ను ఇటీవలేఅభివృద్ధి చేశామని అన్నారు. ఈ ఉపకరణాన్ని అన్ని కేసులనూ స్మార్ట్ షెడ్యూలింగ్ చేసేందుకు, ద్దీగా ఉండే కోర్టులను ప్రభావవంతంగా నిర్వహించేందుకు సహాయపడే రీతిలో తీర్చిదిద్దినట్లు చెప్పారు. లాక్ డౌన్ మరియు ఆ తరువాత కాలంలో అంటే 24-03-2020 నుంచి 13-09-2020 వరకూ దేశవ్యాప్తంగా జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులు 15,32, 334 కేసులను పరిష్కరించాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాన్ని 3240 కోర్టు కాంప్లెక్స్లు మరియు 1272 కరస్పాండింగ్ జైళ్లలో దేశవ్యాప్తంగా కల్పించిట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు మరియు దిగువ కోర్టులలో పెండింగ్ కేసులు గురించి రాజ్యసభ సభ్యుడు పరిమిల్ నత్వానీ కేంద్రన్యాయశాఖను ప్రశ్నించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పెండింగ్ కేసులపై ఏమైనా ప్రభావం పడిందా, ఎలాంటి చర్యలు తీసుకున్నారు/ ఈ పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోబోతుంది అని పార్లమెంట్లో అడిగారు. దేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామీణ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నారు? గత మూడేళ్లలో ఎన్ని ఏర్పాటుచేశారు? అని మరో ప్రశ్నలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిస్తూ.. ఏపీలో 2020 సంవత్సరం కోసం 42 గ్రామ న్యాయాలయాలు లేదా రూరల్ కోర్టులను నోటిఫై చేశామని, గత మూడేళ్లలో ఒక్కటీ చేయలేదని వెల్లడించారు.