దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 95వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,06,615 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 96,424 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,677కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉండటం ఊరటకలిగించే విషయం. దేశంలో వైరస్ సోకినవారిలో ఇప్పటికే 41లక్షల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 87వేల మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కరోజు వ్యవధిలో ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో మరో 10లక్షల క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న మరో 1174 మంది రోగులు చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 84,372కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.86శాతానికి చేరగా.. మరణాల రేటు మాత్రం 1.62శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో దాదాపు 60శాతానికి పైగా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 13రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.