కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి పదవికి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను ప్రధాని సిఫార్సుల మేరకు మరో మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు అప్పగించారు. ఇప్పటికే తోమర్ వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు బిడ్డగా, అన్నదాత సోదరిగా వారికి అండగా నిలుస్తూ పదవి నుంచి తప్పుకొంటున్నందుకు గర్వంగా ఉందని ట్విటర్లో పేర్కొన్నారు. ఈమేరకు ప్రధానికి నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంటూ రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరకుల(సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులపై గురువారం రాజకీయ రగడ చెలరేగింది. విపక్షాల నుంచే కాక, ఎన్డీయే మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ మోదీ సర్కారు వెనక్కి తగ్గలేదు. లోక్సభలో వాటిని గురువారం మూజువాణీ ఓటుతో ఆమోదింపజేసుకుంది.