అయినంపూడిలో దళిత మహిళపై సజీవ దహనానికి యత్నంచారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, దళిత, ప్రజా సంఘాలు చలో అయినంపూడికి పిలుపునిస్తే ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉండేందుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. దళిత సోదరులు అంతా భుజాన వేసుకోని వైసిపిని అధికారంలోకి తెచ్చారని... దళితులపై దాడి చేసే హక్కు తమదే అన్నట్లు వైసిపి వ్యవహరిస్తుందని విమర్శించారు. శివప్రసాద్ శిరోముండనం ఘటనపై ప్రభుత్వం చర్యలు ఉంటే శ్రీకాంత్ శిరోముండనం జరిగేది కాదన్నారు. దళితులపై సుమారు 150కిపైగా దాడులు వైసిపి ఏడాది పాలనలో జరిగాయని ఆయన ఆరోపించారు. దళితులపై దాడులు అన్నీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహాలు మాయమైతే ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. అంబేద్కర్ స్మృతి వనంని నిర్వీరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. అంబేద్కర్ అంటే వైసిపికి చులకన భావం ఉందన్నారు. దళితులపై జరిగిన దాడులు అన్నింటి పైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దళిత, ప్రజా సంఘాలు అన్నింటితో కలసి పోరాటం చేస్తామని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.