కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున అన్నదాతలకు ఈ డబ్బులు అందజేస్తోంది మోడీ సర్కార్.. పీఎం కిసాన్ స్కీమ్ కోసం ఏకంగా రూ.75 వేల కోట్లు కేటాయించారు. ఇక ఈ స్కీమ్ ఆరో విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు (ఆగస్టు 9) ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందనున్నారు. ఇక, ఆరో విడతగా రూ. 17,000 కోట్లను కేంద్రం విడుదల చేయనుంది. ఈ సారి కూడా రూ. 2 వేలను రైతుల ఖాతాలకు కేంద్రం బదిలీ చేయనుంది. ఆగష్టు 9న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.