అమరావతి: రెవెన్యూశాఖ ప్రక్షాళనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. రెవెన్యూశాఖ రూపురేఖలను సమూలంగా మార్చి దానిని ప్రజలకు చేరువయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉద్యోగుల కోసం ఆయన వర్క్ షాపు నిర్వహించబోతున్నారు. అవినీతికి మారుపేరుగా మారిన ఈ శాఖను ఎలాగైనా సంస్కరించాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. దీంతో సీఎంవో రంగంలోకి దిగింది.
రెవెన్యూశాఖ ప్రక్షాళనకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆ శాఖ అధికారులు ఆగమేఘాలపై కార్యచరణకు దిగారు. రెవెన్యూశాఖ పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని శాఖ గౌరవాన్ని పెంచేందుకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ రెవెన్యూశాఖలోని కిందిస్థాయి అధికారులకు లేఖలు రాసింది. త్వరలోనే అంతర్మధనం సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.