ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 436 మార్గాల్లో 1,700కుపైగా బస్సులు నడుపుతూ పరిమిత సీట్లలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. కేవలం నాన్-ఏసీ సర్వీసులనే ఆర్టీసీ ప్రారంభించింది. ఒంగోలు, గుంటూరులకు బస్సు సర్వీసులు నడవలేదు. అక్కడి జిల్లా యంత్రాంగం బస్సులు వచ్చేందుకు అనుమతించకపోవడతో.. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్లు రద్దయినట్లు సమాచారం పంపించారు. తాజాగా, వేసవి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ బస్సులు, రాత్రిపూట సర్వీసులు నడిపేందుకు ప్రజా రవాణా విభాగం సన్నద్ధమయ్యింది. వీటిల్లో 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆదివారం విశాఖ, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి 126 బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.