లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివాహాలను వాయిదా వేసుకున్న పరిస్థితి ఎదురయ్యింది. ఆంక్షలతో పెళ్లిళ్లను వాయిదా వేయడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన వివాహాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వివాహాల కోసం ఎదురుచూస్తున్న వారికి కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివాహాలను ఆదివారం జరుపుకోవచ్చంటూ యడియూరప్ప ప్రభుత్వం చేసిన ప్రకటన పలు కుటుంబాలకు సంతోషానిస్తోంది. లాక్డౌన్ 4.0 మే 31 వరకు కొనసాగనుండగా.. వివాహాలను ముందుగానే నిర్ణయించుకున్నవారు మే 24, మే 31 తేదీలలో అంటే ఆదివారం రోజు మాత్రమే కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి జరుపుకోవచ్చని కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్మేంట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారి టీకే అనిల్ కుమార్ తెలిపారు. అయితే, పెళ్లికి 50 మందిలోపు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నియయాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఉండేవారిని, 65 ఏళ్లు దాటినవారు, 10 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులను వివాహ వేడుకల్లో పాల్గొనడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది.