ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేదలకు నెలకు ఒక సిలిండర్ చొప్పున 3 నెలలకు ఉచితంగా 3 సిలిండర్లు అందజేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. సిలిండర్ కు అయ్యే నగదును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద అర్హులైన వారి ఖాతాల్లో జమ చేసింది. వారు సిలిండర్లు కూడా తీసుకున్నారు. అయితే అర్హులు సిలిండర్లకు చెల్లించిన నగదును తిరిగి చెల్లిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ పథకం వర్తించనుంది. పీఎంయూవై కస్టమర్లు గ్యాస్ సిలిండర్కు చెల్లించిన డబ్బును వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఐఓసీ తెలిపింది. 3.7 కోట్ల మంది పీఎంయూవై కస్టమర్లకు రూ.2780 కోట్లు బదిలీ చేశామని తెలిపింది. కేవలం ఉజ్వల పథకం కింద అర్హులకు మాత్రమే డబ్బును రిటర్న్ చేస్తున్నామని ఐవోసీ తెలిపింది. అదే విధంగా గ్యాస్ కొరత లేకుండా అదనపు ఎల్పీజీ దిగుమతుల కోసం డీల్ కుదుర్చుకున్నామని ఐవోసీ తెలిపింది. ఎల్పీజీ గ్యాస్కు సంబంధించి సాధారణ దిగుమతుల కన్నా ఏప్రిల్, మే నెలల్లో 50 శాతం ఎక్కువగా దిగుమతి చేసుకుంటామని ఐఓసీ తెలిపింది. కాగా ఐఓసీ గత 15 రోజుల్లో ఏకంగా 3.38 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసింది. అంటే రోజుకు 26 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.