ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో భారీగా ఉద్యోగాల కోత?

national |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 12:51 AM

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అన్ని దేశాలను హెచ్చరించింది. సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం ఈ ఏడాది 13- 32 శాతం మధ్య నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. భారత్ లో కూడా భారీగా ఉద్యోగాల్లో కోత పడనుంది. సుమారు 40 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదముందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే భారత్ లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. పలు స్టార్టప్ లు ఇప్పటికే కొందరిని తొలగించాయి. మల్టీనేషనల్ కంపెనీలు కూడా కొంతమంది ఉద్యోగులను తీసేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వీటితోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, స్విగ్గి, ఉబెర్, ఓలా లాంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను ఆపేసాయి. ఇప్పటికే భారత్ లో చాలాచోట్ల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ- కామర్స్ సెక్టార్ తో పాటు పర్యాటక, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌ ఇలా అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. చిన్నచిన్న వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు, వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ పనుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. నివేదికల ప్రకారం భారత్ లో నిరుద్యోగ శాతం 23 కు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పరిస్థితి ఈవిధంగానే ఉంది. 2008-2009 మధ్య తలెత్తిన సంక్షోభంలోనూ 12.5 శాతం దాటని క్షీణత ఈ సారి చాలా ఎక్కువగా ఉండడం పట్ల డబ్ల్యూటీవో చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో దేశాల ఆర్థిక వ్యవస్థలు కాస్త నిలదొక్కుకుంటాయని, అయితే ఈ క్షీణత మాత్రం 21 శాతం నుంచి 24 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుందని చెప్పారు. అన్ని దేశాల క్షీణత రెండంకెల సంఖ్యలోనే (దాదాపు 13 నుంచి 32 శాతం మధ్య ) ఉంటుందని చెప్పారు. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడనంతగా ఆర్థిక సంక్షోభం తలతెతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల తతెత్తుతున్న ఆరోగ్య సంక్షోభంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. నిజానికి వాణిజ్యంలో క్షీణత గత ఏడాదే నమోదైందని, చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఆయన తెలిపారు. కరోనా కారణంగా విధిస్తోన్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఈ ఏడాది మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో వాణిజ్యానికి మార్కెట్లు తెరవడం, పెట్టుబడులు రాబట్టడం వంటి అంశాలను దేశాలు సాధిస్తే ఆర్థిక రంగం త్వరగానే కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. గతంలో ఆర్ధిక మాంద్యాన్ని అవలీలగా అధిగమించిన భారత్ ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com