రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఏదైనా ఒక వస్తువు మీదనో, శబ్దం మీదనో, విషయం మీదనో మనసును పూర్తిగా కేంద్రీకరించడమే యోగా. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఒత్తిడిని జయించే సులభ సాధనం యోగా. వివిధ ఆసనాలలో ఉంటూ శ్వాస మీద ధ్యాసను నిలపడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతారు. శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా సులభంగా ఉంటుంది. యోగాభ్యాసం ద్వారా శరీరంలో ఆక్సిజన్తో కూడిన రక్తం శరీరమంతా బాగా స్రవిరిస్తుంది. వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. శరీరం రిలాక్స్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. హాయిగా నిద్రపోతారు. కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సైనస్, ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి. తలనొప్పి, మైగ్రేన్ అంటే పార్శపు నొప్పి తగ్గి పోతుంది. జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు. ఆత్మవిశ్వాసం , స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. అనవసరమైన ఆలోచనలు మనసులోకి రావు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనే సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి.