మహారాష్ట్రపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకూ అక్కడ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఐతే, మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోసా సోకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాంగ్లి జిల్లా ఇస్లామ్పూర్లో ఓ ఉమ్మడి కుటుంబంలో ఈ కరోనా కేసులు నమోదయ్యాయి. మొదట నలుగురు కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో పర్యటించి.. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు వచ్చారు. మార్చి 23న వారికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. అనుమానంతో కుటుంబ సభ్యలందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు చేయగా.. వారం రోజుల వ్యవధిలోనే మరో 21 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మొత్తం 47 మందికి టెస్ట్లు చేయగా 25 మంది కరోనా బారినపడ్డారు. ఐతే, మహారాష్ట్రలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదని.. ప్రైమరీ కాంటాక్ట్ కేసులు మాత్రం నమోదయ్యాయని అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తిని నేరుగా తాకడం వల్లే వ్యాధి సంక్రమించిందని చెప్పారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులంతా పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారని, అందువల్లే ఒకరి నుంచి మరొకరికి సోకిందని కలెక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 215 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా మరో 12 మంది కరోనా బారినపడినట్లు పరీక్షల్లో తేలింది. పుణెలో 5, ముంబైలో 3, నాగ్పూర్లో 2, కొల్హాపూర్లో 1, నాసిక్లో 1 కేసు నమోదయ్యాయి.