ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు భద్రత పెంచాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో.. దీదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. జెడ్ కేటగిరీ భ్రదతలో భాగంగా.. ఇద్దరు వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఒక ఎస్కాట్, హౌజ్ గార్డ్ సహా అవసరాన్ని బట్టి స్థానిక పోలీసుల భద్రతను కూడా ప్రశాంత్ కోసం ఏర్పాటు చేయనున్నారు.
2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ ఎన్నికలను దీదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న దీదీ.. పీకే సాయం తీసుకుంటున్నారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పుంజుకుంది. 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కి సవాల్ విసిరింది.పీకే.. ఎక్కడ వ్యూహకర్తగా పనిచేసినా... ఆ రాష్ట్రంలో.. ఆయన సూచనలు ఇచ్చిన పార్టీ.. విజయం సాధించడం పక్కా... చాలా తక్కువ సార్లు లెక్కలు తప్పినా... ప్రధాని పీఠంపై నరేంద్ర మోడీ కూర్చోవడం నుంచి... తాజాగా ఢిల్లీ సీఎంగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టేవరకు ఎన్నో కీలక సూచనలు చేస్తూ వస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఏపీలో వైసీపీ తిరుగులేని విజయం సాధించడంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నారు.