కరోనా వైరస్ చిత్తూరు జిల్లాలో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక చిత్తూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ కు గుండె దడగా ఉండటంతో పరీక్షల కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి వైరల్ ఫీవర్ రావటం తోటే జ్వరం, దగ్గు వచ్చిందని.. దానివల్ల గుండె దడగా ఉందని చెప్పి రెండు రోజుల పాటు చికిత్స చేసి డాక్టర్లు ఇంటికి పంపించారు.
గత ఆదివారం ఇంటికి చేరుకున్న బాలకృష్ణ తనకు కరోనా వైరస్ సోకిందని ఎవరూ తన వద్దకు రావద్దని, ముట్టుకోవద్దని చెప్పి అందరికీ దూరంగా ఉంటూ వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమి కొట్టి గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు పోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారు జామున గదిలోంచి బయటకు వచ్చిన బాలకృష్ణ తన పొలానికి వెళ్లాడు. అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్నచెట్టుకు ఉరేసుకుని ఆత్య హత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.