వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : అతనికి అవసర మైన మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిపోయి ఇంటా బయటా తాము ఎదుర్కొనే టెన్షన్లను నర్సులు, డాక్టర్లు రోగి మీద చూపడం అతనికి మరింత అనారోగ్యాన్ని కలుగజేస్తుంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులలో స్చచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్య మంత్రి-ప్రత్యక్ష ప్రసారం ద్వారా 13 జిల్లాల ప్రధాన ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులతో, అక్కడి వైద్య సిబ్బందితో ముఖాముఖి సంభాషించారు. అమెరి కాలోని 150 సంవత్సరాల ప్రఖ్యాత మయో ఆసుపత్రి మనకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి హితవు పలి కారు. పేషెంట్ ఫస్ట్ అనే నినాదాన్నే విధానంగా మార్చు కున్న ఈ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు రోగులను పల కరించే విధానం, పనిచేసే పద్ధతి ఇక్కడ అందరికీ మార్గద ర్శకమని అన్నారు. ముఖ్యంగా వైద్యులు పలకరించే తీరుతోనే రోగులకు సగం స్వస్థత కలుగుతుందని, వృత్తి నైపుణ్యంలోనే కాకుండా ప్రవృత్తి నైపుణ్యం కూడా అవసరమని గుర్తించి ఆ దిశగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర వైద్య రంగంలో వినూత్న విధానాలు తీసుకువచ్చామని, పేద వర్గాలకు కార్పొరెట్ తరహా వైద్య సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు, పేద, మధ్య తరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడానికి ఎన్ని నిధులైనా వెనుకాడకుండా కేటాయింపులు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ-ప్రైవెట్ భాగస్వామ్య పద్ధతిలో వినూత్న విధానాలను అమలుచేస్తున్నట్టు చెప్పారు. వైద్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్ని తరహా ఎన్టీఆర్ వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్, బసవతారకం మదర్ కిట్ వంటి కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నామని వివరించారు. సమాజంలో పేదవర్గాలు సైతం నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకోగలిగే అవకాశం త్వరలో కల్పిస్తున్నామని సీయం చెప్పారు. ఆఖరికి చనిపోయిన వ్యక్తిని సేవాభావంతో చివరి గమ్యానికి చేర్చే మహాప్రస్థానం వాహనాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నాలెడ్జ్ పార్టనర్, సర్వీస్ ప్రొవైడర్లను ఏర్పాటుచేసుకుని ఏపీ వైద్య ఆరోగ్యరంగం దేశంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలిచిందని అన్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ద్వారా పేషెంట్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధానాన్ని తీసుకువస్తున్నామని ప్రకటించారు. సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులలో ప్రవేశపెడుతున్నామని, ఆయా ఆసుపత్రులలో ఏడు రోజులూ ఏడు రంగుల బోర్డర్లతో కూడిన దుప్పట్లను మారుస్తారని కార్యక్రమంలో పాల్గొన్న వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఒక రోగికి రెండున్నర దుప్పట్లు చొప్పున అందుబాటులోకి వుంచుతున్నామన్నారు. ఒక రోగి రోజుకు రెండున్నర పర్యాయాలు దుప్పట్లు మార్చగలిగే అవకాశం కలుగుతుందన్నారు. తొలివిడతగా 13,200 పడకలకు దుప్పట్లు అందిస్తున్నామని, దీనికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. రెండోదశలో మరో 12000 పడకలకు దుప్పట్లు అందజేస్తామన్నారు. రోజుకో రంగు బోర్డర్తో వున్న దుప్పటి చొప్పున ఏడు రంగుల బోర్డర్లు వున్న దుప్పట్లను ఏడు రోజులు వేస్తారని చెప్పారు. ఏరోజు దుప్పటి మార్చకపోయినా రోగులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించవచ్చునని, నేరుగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. దుప్పటి మొత్తం నాణ్యత గల లెనిన్ క్లాత్ మెటీరియల్తో తయారుచేసినదని, ఒక్కొక్క దుప్పటిని 60 ఉతుకుల తరువాత మార్చి తీసివేస్తారని తెలిపారు. సోడియం హైపో క్లోరైడ్తో ఉతకడం వల్ల రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం వుండదని చెప్పారు. ఇండియన్ రైల్వే వారి మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని, దుప్పట్లు మార్చడంలో శాస్ర్తీయంగా అంచనా వేసి, పరీక్షలు జరిపి తుది నిర్ణయాలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు శర్మ చెప్పారు. సోమవారం ఊదారంగు, మంగళవారం ఆరెంజ్, బుధవారం మెజెంటా, గురువారం ఆకుపచ్చ, శుక్రవారం ఇటుక రంగు, శనివారం నీలిరంగు, ఆదివారం పసుపు రంగు బోర్డర్లు వున్న దుప్పట్లు మార్చుతారని చెప్పారు. కార్యక్రమంలో బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసులపై సహకారం అందించడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చున్నారు.